Clsr

Recent Posts

మౌనం గా ఉండగలరా ??


నేను ఉత్త వాగుడు కాయను అని మా స్నేహితులు అనే వారు.
 వాళ్ళు అన్నారని కాదు కానీ అదేమిటో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటాను.

కొన్ని సార్లు అతిగా మాట్లాడి స్నేహితులను దూరం చేసుకున్నాను. మన మాటలు ఎదుటి వాళ్ళను నొప్పిస్తాయని కావాలని ఎప్పుడు మాట్లాడలేదు. ఏదో ఆవేశం లో మాటలు దొర్లి పోతుంటాయి. దగ్గరి బంధువులు కూడా నొచ్చుకున్న సందర్భాలు లేక పోలేదు. వయసు పెరిగే కొద్ది అనుభవాలు ఎదురయ్యే కొద్ది వాగుడు తగ్గించేసాను. మాట్లాడకుండా ఉండటం లేదా  అతి తక్కువగా మాట్లాడటం మొదట్లో కష్టం అనిపించింది. తర్వాత అందులో సుఖం అర్ధమైంది. మా వాళ్ళందరూ నాలో మార్పు చూసి ముక్కున వేలేసుకున్నారు.
 వాస్తవానికి  "మౌనం" సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పుకోక తప్పదు. 
పూర్తిగా మౌనం గా ఉండ లేకపోయినా కనీసం ఎక్కువగా మాట్లాడటం తగ్గించుకోవాలి. అయితే కమ్యూనికేషన్ కొత్త పుంతలు తోక్కిననేపధ్యం లో మౌనంగా వుండటం  కానీ
 మాటలు తగ్గించడం కానీ సాధ్యమా ?
అంటే చాలా చాలా  కష్టమే అని చెప్పు కోవాలి. కొంతమందిని చూడండి.ఒక్క నిమిషం కూడా సెల్ ఫోన్ ని వదలరు.బాత్ రూం లో కూడా మాట్లాడుతుంటారు  అసలు మౌనం గా ఉండటానికి లేదా  మాటలు తగ్గించడానికి  చాలా ప్రాక్టీసు అవసరం.  మనసును నియంత్రించాలి.అహాన్ని అణుచు కోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే   పంచేద్రియాల పై పట్టు బిగించాలి.  అప్పుడే మౌనం సాధ్యం అవుతుంది. 
 వాక్కుని నిరోధించడమే మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. 
ఇలా మౌనంగా ఉండటం వల్ల పరుషవచనాలు పలకటం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పటం,  అసందర్భ ప్రలాపాలకు  అవకాశం లభించదు.ఎవరితో ఏ గొడవా  ఉండదు.
 మనసును ప్రశాంతంగా ఉంటుంది.బీపీ షుగర్ లు తగ్గుతాయి.తద్వారా ఖర్చు కూడా తగ్గిపోతుంది.నిజమా అని ఆశ్చర్య పోకండి.నిజమే.
 ప్రపంచంలో మౌనానికి ఉన్న శక్తి దేనికీ లేదు. 
  మన ఆలోచనలను, దృక్పథాలను మనసులో దర్శించుకోవడానికి మౌనం చాలా అవసరం. 
నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన అహం నిద్రాణస్థితిలోకి వెళుతుంది.  అప్పుడు వాస్తవ ప్రపంచాన్ని స్థిమితంగా చూడగలుగుతాం.  అలా చేయడం వల్ల శరీరం నూతన తేజస్సును, కాంతిని పొందగలుగుతుంది.  నిరంతరం మాట్లాడుతూ ఉండటం వల్ల మన చుట్టుపక్కల ఉన్న సౌందర్యాన్ని చూడలేకపోతున్నాం.
 ఎవరితోనైనా వాదించటం కంటె మౌనంగా ఉండటం ఉత్తమం. 
ఇలా ఉండటం వల్ల అనవసరమైన కోపాన్ని నియంత్రించుకోవచ్చు.  ఎప్పుడైతే కోపాన్ని అణచుకోగలుగుతామో, అప్పుడు శరీరభాగాలు విశ్రాంతిదశలో ఉంటాయి.  రక్తప్రసరణలో హెచ్చుతగ్గులు ఉండవు. హృదయస్పందన ప్రశాంతంగా ఉంటుంది.  పలు రోగాలకు దూరం గా వుంటాము.  మన పట్ల కోపం తో ఎవరైనా పెద్దగా అరుస్తున్నప్పుడు కూడా మౌనమే ఉత్తమమార్గం.  అనవసరంగా అరవడం, కోపం తెచ్చుకోవడం వల్ల శరీరం  శక్తిని కోల్పోతుంది.  ఉద్యోగాలు చేసే చోట, చాలామంది ఒకరి మీద ఒకరు నిరంతరం అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు.  అలా అనవసరంగా మాట్లాడటం వల్ల మనసులు కలుషితమవుతాయి.  అందుకని లేనిపోని మాటలు మాట్లాడటానికి బదులు మౌనం శ్రేయోదాయకం.  మౌనం పాటించడాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే దీనికి మించిన సాధనం లేదు.  ‘మౌనం బంగారం, మాట వెండి’ అన్నారు.  అయితే  అవసరమైన సందర్భాల్లో కూడా మౌనం పాటిస్తే  అనర్ధాలు జరుగుతాయి.అవసరం ఉన్నపుడు క్లుప్తంగా.. సూటిగా చెప్పదలుచుకున్న విషయాన్నీ చెప్పండి.ఎదుటి వారికి విషయం అర్ధం అవుతుంది. మౌనం విలువ ఎలాంటిదో అనుభవిస్తేనే తెలుస్తుంది.ఒక సారి రుచి చూడండి. మౌనం పై మీ అభిప్రాయాలను కూడా తెలియ చేయండి.అంతే గానీ మౌనంగా ఉండకండి.