Clsr

Recent Posts

Importance of Karthika Pournami



కార్తిక పౌర్ణమి



సౌందర్యాన్ని ఆశ్చర్యపరిచే జగత్సౌందర్యమే కార్త్తిక పూర్ణిమ. కార్త్తిక మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే తిథులలో కార్త్తిక పూర్ణిమ ఒకటి. శంకరుని అతి ప్రియమైన రోజు ఇది. ఈ రోజు కుమారస్వామిని దర్శించాలి. ఈశ్వరాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. ఈరోజు చేసే దీపదానానికి ఎంతో విశేష ప్రాముఖ్యం ఉంది. శివుడు త్రిపురాసుడిని సంహరించింది ఈ పౌర్ణమినాడే. అందుకే త్రిపుర పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఉదయంనుంచి ఉపవాసంఉండి ప్రదోషంలో అంటే సాయంకాంలో స్ర్తిలు దీపాలను వెలిగించాలి. తరువాత పురుషులు ఆ దీపాలను విధివిధానంగా ఆరాధించాలి. ఈ దీపారాధన ఉసిరిక చెట్టుకింద చేస్తే విశేష ఫలితాల్ని పొందవచ్చు. త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశ్వరుని దృష్టి దోషపరిహారం కోసం ఇంకా విజయుడైన అతని గౌరవార్ధం పార్వతీదేవి మొదటిగా ఈ జ్వాలా తోరణాన్ని జరిపించిందనీ అప్పటినుండి ఇది ఆచారమైనదని కథనం. ఈ జ్వాలా తోరణాన్ని దర్శించడం వల్ల సర్వ పాపాలు హరించబడతాయని ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారించబడుతుందని ప్రతీతి. గడ్డిని తోరణంగా పేని దాన్ని వెలిగించి మంట చేసి ఆ మంటను కిందినుంచి పార్వతీదేవిని అటు ఇటు తిప్పుతారు. దీన్ని జ్వాలా తోరణం అంటారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినపుడు వెలువడ్డ హాలాహలాన్ని భరించలేక లోకాలు తల్లడిల్లిపోతుంటే తన భర్తను వేడుకుని హాలా హలాన్ని స్వీకరించి లోకాన్ని రక్షించమని ప్రార్థిస్తుంది. దానికి గుర్తుగానే ఈ జ్వాలా తోరణాన్ని నేటికీ వెలిగిస్తారంటారు. కొందరు ఈరోజు తులసిచెట్టు, ఉసిరి చెట్టు ముందు ముగ్గు పెట్టి, దీపం వెలిగించి షోడశోపచార పూజ చేసి తులసి దగ్గరే వంట చేసుకుని భోజనం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే తులసి, ఉసిరి చెట్లను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించి మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు శివుడిని పూజించి భక్తేశ్వర వ్రతం చేయాలి. ఈ దినం పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివుడిని అభిషేకించి, మారేడు దళాలతో పూజించి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ వ్రతం చేసినట్టయితే వైధవ్య బాధలు వుండవని శాస్త్రాలు చెప్తున్నాయి.

కార్తిక పౌర్ణమి రోజున ముత్తయిదువలు ఆచరించి తమ ఐదోతనాన్ని కాపాడమని పరమేశ్వరుడ్ని ప్రార్థించుకుంటారు. సాక్షాత్తు సర్వమంగళాదేవి అయిన మంగళగౌరి కూడా కార్తీకమాసంలో దీపాల్ని వెలిగించి మురిసిపోతుందిట. అందుకే ఈరోజు దీపారాధనకు ప్రాముఖ్యత ఏర్పడింది.

కార్తికపూర్ణిమ నాడు మనసును ప్రశాంతంగా ఉంచి, ‘ఓం నమఃశ్శివాయఅంటే చాలు, ఒక పవిత్ర శక్తి ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రదక్షిణం చేసి గంగలో మూడు మునకలు వేసి పరమోత్కృష్టమైన కైలాస శిఖరాన్ని తాకి, మనపై కారుణ్యామృతాన్ని వర్షిస్తుందని శివపురాణం స్పష్టం చేస్తోంది. జలం, జ్వాల ఈ రెండును ప్రతి ఒక్కరికి అవసరమే. అందుకే నదుల్లో స్నానమాచరించి, దీప తోరణాలను చెరువుల్లోకానీ, బావుల్లోకానీ నదుల్లోకానీ వదలడం కన్నుల పండువగా కన్పిస్తుంది. కార్తీక దామోదరునిగా ప్రసిద్ధి చెందిన విష్ణువును ఉసిరిక చెట్టుకింద దీపంపెట్టి వేదపఠనం కావించి అర్చిస్తారు. తులసి కోట దగ్గర శివాలయంలోను మున్నూట అరవై వత్తులతో దీపారాధన చేస్తారు.
శ్రీహరి దేవేరియైన శ్రీ మహాలక్ష్మి కార్తీకపూర్ణిమనాడు ఇంటింటికీ వస్తుందని, ఏ ఇంట శివలింగారాధన జరుగుతుందో శివనామ స్మరణ జరుగుతుందో ఆ ఇంట రహస్య శక్తులతో ప్రవేశిస్తుంది. దీపాలు ఎవరి ఇంట ఈరోజు సాయంకాలం వెలిగిస్తారో వారి దారిద్య్రం తొలగిపోతుంది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని పారద్రోలి ఆకాశాన నిండు చంద్రుడు నిలిచిన పూర్ణిమనాడు చంద్రోదయ సమయంలో నదులలో, అరటి దొప్పలలో ఆవునేయితో దీపాలను వెలిగించి వదులుతారు. అందుకే కార్తీక మాసానికి సమమైన మాసం ఇంకేదీ లేదని చెప్తారు. ఇన్ని లక్షణాలున్న కార్తీక మాసాన్ని, ముఖ్యంగా పౌర్ణమినాడు మనమందరం కూడా దీపారాధన చేసి దీపాలను నీటిలో వదిలి ఆ శివకేశవుల ప్రీతికి పాత్రులవుదాం.

Importance of Season of Karthika Maasam